© 2026 nimisham.in
స్వదేశీ తయారీ యుద్ధ విమాన ప్రాజెక్ట్ తేజస్ ఎంకే-2పై వైమానికదళ మాజీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భారత్లోనే రూపొందుతున్న ఈ విమానాలు 2030ల మధ్య నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పటికీ, అప్పటి యుద్ధ అవసరాలకు అవి ఏమాత్రం సరిపోకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే చైనా 6జీ ఫైటర్ జెట్లను (J-36, J-50) అభివృద్ధి చేస్తూ.. 2030 నాటికి దాదాపు 500 5జీ J-20 విమానాలను మోహరించేందుకు సిద్ధమవుతోందని అన్నారు. పాకిస్థాన్ కూడా 5జీ జెట్లను సమకూర్చుకునే పనిలో ఉందని, ఇలాంటి సమయంలో 2035 నాటికి భారత్ 4జీ విమానాలపై ఆధారపడటం వ్యూహాత్మకంగా ప్రయోజనం ఉండదని ఆయన తేల్చిచెప్పారు. పదవీవిరమణ చేసిన కొద్ది రోజుల్లోనే ఆయన ఇటువంటి విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ యుద్ధ విమానాల తయారీలో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ జాప్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఏళ్ల కిందట మొదలుపెట్టిన విమానాలను ఏదో ఒక నెపంతో ఆలస్యం చేయడం సరికాదు. ఐఏఎఫ్ అత్యవసర ప్రాధాన్యతలకు, హెచ్ఏఎల్ పనితీరుకు పొంతన లేదు’’ అని ఆయన విమర్శించారు. ‘‘ఎన్నో ఏళ్ల కిందట ఒక నిర్దిష్ట సామర్థ్యంతో మనకు అందజేస్తామని ఇచ్చిన హామీని ఏదో ఒక నెపంతో మనకు ఎందుకు నిరాకరిస్తున్నారు? ఎవరైనా తమ వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వల్ల మనం ఎందుకు నష్టపోవాలి? స్వదేశీ సాంకేతికత మంచిదే, కానీ మనం ఎంతకాలం వేచి ఉండాలి?’’ అని ఆయన ప్రశ్నించారు.HAL అత్యంత అత్యవసరంగా పని చేయడం లేదని, ఐఏఎఫ్ సమయపాలనతో వారి వైఖరి సరిపోలడం లేదని అన్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2021లో రూ. 46,000 కోట్లతో ఆర్డర్ చేసిన 83 తేజస్ Mk-1A విమానాల్లో ఇప్పటివరకు ఒక్కటి కూడా డెలివరీ కాలేదు. సెప్టెంబరు 2025లో రూ. 62,370 కోట్లతో మరో 97 ఎంకే 1A జెట్లకు ఆర్డర్ ఇచ్చారు. తేజస్ Mk-2 మొదటి ప్రయోగం 2022లో జరగాల్సి ఉండగా, అది కాస్తా 2027 నాటికి వాయిదా పడింది.2035 నాటికి చైనా ఆరో తరం విమానాలకు మారడం, పాకిస్థాన్ ఐదో తరం జెట్లను పరిశీలిస్తున్న తరుణంలో భారత్ 4జీ విమానాలపై ఆధారపడటం అర్ధవంతమేనా అని అడిగిన ప్రశ్నకు ఎయిర్ మార్షల్ బదులిస్తూ.. ‘‘కార్యాచరణ పరంగా, ఖచ్చితంగా కాదు’’ అని స్పష్టం చేశారు. తేజస్ Mk-2 వంటి నాలుగో తరం విమానాలు అగ్రశ్రేణి పోరాటంలో కాకుండా, దేశ విస్తృత విస్తీర్ణం కారణంగా ఏర్పడే ఇతర గ్యాపులను పూరించడానికి మాత్రమే ఉపయోగపడతాయని ఆయన అన్నారు.కేవలం స్వదేశీ పరిజ్ఞానం పేరుతో సుదీర్ఘకాలం నిరీక్షించడం శ్రేయస్కరం కాదని, ఐరోపా దేశాలు చేపడుతున్న FCAS (ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ కూటమి) లేదా GCAP (యూకే, ఇటలీ, జపాన్ కూటమి) వంటి 6జీ యుద్ధ విమానాల ప్రాజెక్టులలో భారత్ భాగస్వామి కావాలని ఆయన సూచించారు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఐదో తరం స్టీల్త్ ఫైటర్ AMCA ప్రాజెక్ట్ నుంచి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను కేంద్రం తప్పించింది. టాటా, ఎల్ & టీ-బెల్ , భారత్ ఫోర్జ్-బెమ్ల్ వంటి ప్రైవేట్ భాగస్వాములకు ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ దక్కే అవకాశం ఉంది.